కామారెడ్డి అర్బన్: భూమిపై జీవరాశుల మనుగడ నీటితో ముడిపడి ఉందని, వర్షం నీటిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని జిల్లా భూగర్భజల అధికారి సతీశ్యాదవ్ అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షం నీరు, భూగర్భజలాల యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, వాల్టా చట్టంపై జిల్లా అధికారి అవగాహన కల్పించారు. ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటేష్, అటవీ శాఖాధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్: మద్నూర్లోని మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహిస్తున్న కందుల కొనుగోలు కేంద్రం ఈనెల 26 వ తేదీ వరకే కొనసాగుతుందని కేంద్రం నిర్వాహకులు చాట్ల గోపాల్ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి త్వరగా తమ పంట ఉత్పత్తిని తీసుకురావాలని సూచించారు. పంటను విక్రయించిన రైతుల ఖాతాలలో 15 రోజుల్లో డబ్బులు జమవుతున్నాయని పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్ : ఇటీవల జిల్లాలో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందించనున్నట్లు ఇస్కాన్ కామారెడ్డి కేంద్ర ముఖ్య ప్రతినిధి వెంకటదాస్ తెలిపా రు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మా ట్లాడారు. స్థానిక శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బహుమతుల ప్రదానంతోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): వయోజన విద్యాశాఖ, డీఆర్డీఏ సమన్వయంతో ఈనెల 29న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎఫ్ఎల్నెట్, ఎన్ఐవోఎస్ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యాసకులు గ్రామాలలోని సెర్ప్ సిబ్బందిని సంప్రదించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ అయిన అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యేలా చూడాలని అన్ని మండలాల ఏపీఎం, ఇతర అధికారులకు సూచించారు.


