రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్‌

Oct 20 2025 9:14 AM | Updated on Oct 20 2025 9:14 AM

రెండు రోజుల్లో  పేకాడుతున్న 81 మంది అరెస్ట్‌

రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్‌

రూ. 85వేలు నగదు స్వాధీనం ఎస్పీ రాజేశ్‌ చంద్ర

కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పేకాడుతున్న 81 మందిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85వేల నగదు, 41 సెల్‌ఫోన్‌లు, 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాడిన వారిపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశామన్నారు. పేకాట, చట్ట వ్యతిరేక కార్యకలపాలను సహించేది లేదన్నారు. దీపావళి నేపథ్యంలో పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాడితే పోలీస్‌ కంట్రోల్‌ రూం నెంబర్‌ 87126 86133కు గానీ, డయల్‌ 100కు గానీ ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు.

బట్టాపూర్‌లో..

మోర్తాడ్‌(బాల్కొండ): ఏర్గట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని బట్టాపూర్‌లో ఒక ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్వర్‌ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,01,280 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు సెల్‌ఫోన్లు, 3 బైక్‌లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇసుక లారీ స్వాధీనం

మోర్తాడ్‌(బాల్కొండ): ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ శివారు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్‌ ఆదివారం తెలిపారు. మెండోరా మండలం పోచంపాడ్‌కు చెందిన కాంట్లి రాజు, కమ్మర్‌పల్లికి చెందిన బోదాసు రాజు లారీలో ఇసుకను నింపుకుని ఏర్గట్లవైపు వస్తుండగా లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్నామన్నారు,

లింగంపేటలో ట్రాక్టర్‌..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని పెద్దవా గు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రాజు అనుమతులు లేకుండా పెద్ద వాగు నుంచి ట్రాక్టర్‌పై ఇసుక తరలిస్తుండగా పట్టుకొని ట్రాక్టర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ముదక్‌పల్లిలో టిప్పర్‌..

మోపాల్‌: మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముదక్‌పల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. డ్రైవర్‌ మహేష్‌ సరైన అనుమతులు చూపకపోవడంతో టిప్పర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement