
రేపే స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో గత పుష్కర కాలంగా (12 ఏళ్లుగా) విద్యార్థులు, అధ్యాపకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో స్నాతకోత్సవాన్ని (కా న్వొకేషన్) బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానుండగా, ముఖ్యఅతిథిగా ఐఐసీటీ మాజీ డైరక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ పాల్గొంటారు. కాన్వొకేషన్ కోసం వర్సిటీ ఉన్నతాధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏడాదికోసారి కాన్వొకేషన్ నిర్వహించాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడగా తొలి కాన్వొకేషన్ను 13 నవంబర్ 2013లో అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ హ యాంలో నిర్వహించారు. ఆ తర్వాత కాన్వొకేషన్ నిర్వహణను మరిచారు. 2018, 2020లో కాన్వొకేషన్ నిర్వహణకు అప్పటి వీసీలు సాంబయ్య, రవీందర్గుప్తా నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్వహించలేకపోయారు. అయితే గతేడాది అక్టోబర్లో వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి రావు కాన్వొకేషన్ నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో నవంబర్లో నోటిఫికేషన్ జారీ అయ్యింది.
హైదరాబాద్ నుంచి జర్మన్ హ్యాంకర్
వర్సిటీ క్రీడామైదానంలో కాన్వొకేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షం, ఈదురు గాలులు వస్తే కార్యక్రమ నిర్వహణకు ఆటంకాలు కలగకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంకర్ను తెప్పించారు. ఇందులో 500 మంది కూర్చునేందుకు వీలుండగా, రూ.9లక్షలు ఖర్చు చేస్తున్నారు. క్యాంపస్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. సూచిక బోర్డులతోపాటు పరిపాలనా భవనానికి వేళ్లే దారిలో ‘ఐలవ్ టీయూ’ పేరుతో శాశ్వత సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. అన్ని బోర్డుల వద్ద లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్భవన్ కార్యాలయం ప్రోటోకాల్ ప్రకారం స్టేజీపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యఅతిథి, వీసీ, రిజిస్ట్రార్తోపాటు ఏడుగురు డీన్స్ మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు, బ్యానర్లు, పేపర్లు తీసుకెళ్లే వీలుండదు. పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.
బెటాలియన్లో
గార్డ్ ఆఫ్ హానర్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చేరుకుంటారు. గెస్ట్ హౌజ్ వద్ద 104 మంది పోలీసు సిబ్బందితో గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తెయూకు చేరుకుని వర్సిటీలో సైతం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కాన్వొకేషన్కు హాజరు కానున్నారు. గవర్నర్ భద్రతా సిబ్బందితోపాటు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీ లో జరుగుతున్న ఏర్పాట్లను వీసీ, రిజిస్ట్రార్లతో కలిసి నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి సోమవారం పరిశీలించారు.
గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు..
తెయూ పరిధిలో 2014 నుంచి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)లో 15,557 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ (యూజీ) లో 60,660 మంది విద్యార్థులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లో 10,079 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేశారు.
పుష్కర కాలం తర్వాత..
తెయూ కాన్వొకేషన్కు చురుగ్గా
సాగుతున్న ఏర్పాట్లు
ఆరు విభాగాలతో ప్రారంభమై..
2006లో ఆరు విభాగాలతో ప్రారంభమైన వర్సిటీ ప్రస్తుతం 24 విభాగాల్లో 31 కోర్సులకు విస్తరించింది. డిచ్పల్లిలోని ప్రధాన క్యాంపస్తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూర్లోని సౌత్క్యాంపస్, నిజామాబాద్ నగరంలోని సారంగపూర్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ కొ నసాగుతు న్నాయి. తెయూకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 109 అనుబంధ యూజీ, పీజీ కళాశాలలు ఉండగా, 31కోర్సులకు గాను 19 అ ప్రూవ్డ్ రెగ్యులర్ కోర్సులు, 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, 7 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి.