
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
నిజామాబాద్ లీగల్: భార్యను చంపిన కేసులో భర్తకు నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం గన్యాతండాకు చెందిన కేలోత్ శ్రీనివాస్, భార్య సరిత పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ తరచు భార్యతో గొడవ పడుతుండే వాడు. ఈక్రమంలో మార్చి 1, 2025న కుటుంబ పోషణ విషయంలో సరిత తన భర్తతో గొడవ పడింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే స్థానికులు అడ్డుకోగా, కొద్దిసేపటికే ఇంటికి వచ్చిన శ్రీనివాస్కు తన కూతురు ఈ ఘటనను వివరించింది. అనంతరం భార్యతో అతడు గొడవపడి గొడ్డలి కామతో కొట్టి చంపి, పరారయ్యాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్ను అరెస్టు చేసి, కోర్టు లో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి జివిఎన్ భరతలక్ష్మి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 5000 జరిమానా విధించింది. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదించారు.
బైక్ చోరీ కేసులో నిందితుడికి 8నెలల జైలు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బైక్ చోరీకి పాల్పడిన నిందితుడికి 8 నెలల జైలు శిక్ష విధిస్తు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. లింగంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బాబు తన బైక్ను గత ఏడాది జనవరి 4న ఎల్లారెడ్డిలోని వెంకటేశ్వర హాస్పిటల్ ఆవరణ ఉంచాడు. పెద్దకొడప్గల్ మండలంలోని బేగంపూర్తండాకు చెందిన చవాన్ సుభాష్ సదరు బైక్ను చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, సాక్షులను విచారించిన అనంతరం సుభాష్కు న్యాయమూర్తి 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తు తీర్పు వెలువరించారు.
గంజాయి విక్రయిస్తున్న వృద్ధురాలు అరెస్టు
ఖలీల్వాడి: నగరంలోని ద్వారకనగర్ గంజాయి విక్రయిస్తున్న ఖాజీబీ అహ్మదీబేగం అనే వృద్ధురాలిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ స్వప్న తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఖాజీబీ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా 450 గ్రామలు ఎండు గంజాయిను పట్టుకున్నారు. అలాగే 2 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలిపై గతంలో పలు కేసులు ఉన్యాయని, కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది రాజన్న, భూమన్న, శ్రీనివాస్, ప్రసాద్ శ్యామ్ సుందర్, కానిస్టేబుళ్లు భోజన్న, సమీర్, శివ, గంగారమ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.
ఆలయంలో చోరీ
నిజామాబాద్ రూరల్: మండలంలోని కేశాపూర్ గ్రామంలోగల మహలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపారు. ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి రూ.15 వేలు, రెండు గ్రాములు బంగారం, రెండు తులాల వెండి అభరణాలను ఎత్తుకెళ్లారన్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు వివరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వాటర్ ట్యాంకర్ బోల్తా
నస్రుల్లాబాద్: మండలంలోని జాతీయ రహదారి పనులకు ఉపయోగిస్తున్న వాటర్ ట్యాంకర్ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. నీటిని సరఫరా చేసి మళ్లీ నింపుకోవడానికి వెళుతుండగా కామిశెట్టిపల్లి నీలం కట్ట ప్రాంతంలో వాహనం అదుపు తప్పిందన్నారు. డ్రైవర్ చాకచక్యంతో దూకేయడంతో ప్రమాదం తప్పిందన్నారు.