
విద్యుదాఘాతంతో నాలుగు గేదెలుమృతి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో ఆదివారం విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతిచెందాయి. కోటార్మూర్ లోని జనార్దన్ గౌడ్ అనే పాడి రైతుకు చెందిన నాలుగు గేదెలు ఆదివారం గ్రామ శివారులో మేతకు వెళ్లగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు వాటికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి, మండల పశువైద్యాధికారి లక్కం ప్రభాకర్ ఘటన స్థలాన్ని సందర్శించారు. సుమారు రెండు లక్షల రూపాయల వ రకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు జనార్దన్ గౌడ్ అధికారులకు తెలిపా రు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైతు ఆరోపించారు.
పోచారం తండాలో ఆవు..
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని పోచారం తండాలో కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి చెందింది. పోచారం తండాలోని విఠల్ నాయక్ చెందిన ఆవు ఆదివారం మేతకు వెళ్లగా సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్కు ఎలాంటి కంచె నిర్మించకపోవడం వల్లనే ఆవు మృతిచెందినట్లు స్థానికులు ఆరోపించారు. ఇప్పటికై నా విద్యుత్శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మరకు కంచె నిర్మించాలని, బాధితుడికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మద్యంమత్తులో వీరంగం
ఖలీల్వాడి: నగరంలో పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సదరు వ్యక్తి బ్రీత్ ఎనలైజ్ చేయడానికి యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు గాయం అయింది. వివరాలు ఇలా.. నగరంలోని పాలిటెక్నిక్ వాటర్ ట్యాంక్ వద్ద ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరానికి చెందిన గౌతమ్ రెడ్డి మద్యం తాగి బైక్ నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయడానికి ట్రాఫిక్ పోలీసులు యత్నించగా సహకరించలేదు. అసభ్య పదజాలంతో సిబ్బందిని దూషించాడు. ఆర్ఎస్సైలు సుమన్, వినోద్లు అతడిని సముదాయించినా, మత్తులో రోడ్డుపై పొర్లుతూ హంగామా చేశారు. బ్రీత్ ఎనరైజ్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ శేఖర్ బాబు కంటికి గాయం అయింది. దీంతో పోలీసులు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.