
పరిరక్షణ కోసం పోరుబాట
నిజాంసాగర్ : కరువు కోరల్లో చిక్కిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగు, తాగు నీటిని అందించడం కోసం మంజీర నదిపై 1923–31 మధ్యకాలంలో జ లాశయం నిర్మించారు. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట కట్టారు. నిర్మాణ సమయంలో నీటి నిల్వ సామర్థ్యం 29.72 టీఎంసీ లు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీ ఎంసీలకు తగ్గిపోయింది. వందేళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
560 ఎకరాల భూమి..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి పాలకులు 560 ఎ కరాల భూములను అప్పగించారు. ఆ భూముల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకు ల కోసం గుల్దస్తా, సమ్మర్ బాగ్, గోల్ బంగ్లా, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ను కట్టించారు. అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న భూములు మాత్రం రోజురోజుకు కనుమరుగు అవుతున్నాయి. అచ్చంపేట శివారులో ఉన్న భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. మరికొందరు వ్యక్తులు నీటిపారుదలశాఖ ఆధీనంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ప్రభుత్వ కార్యాలయాలకు..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయాలుగా మారాయి. 598 సర్వే నంబరులో పోలీస్ స్టేషన్కు 3 ఎకరాలు, వైర్లెస్ కార్యాలయం, ఆరోగ్య కేంద్రానికి 3.5 ఎకరాలు కేటాయించారు. తహసీల్ కార్యాలయానికి 5 గుంటలు, బస్ స్టేషన్కు 2.4 ఎకరాలు, ట్రాన్స్కో కార్యాలయానికి 0.25 ఎకరాలు, బృహత్ పల్లె ప్రకృతి వననానికి 10 ఎకరాలు, అటవీశాఖ ప్లాంటేషన్కు 6 ఎకరాలు, నిజాంసాగర్ పల్లె ప్రకృతి వనానికి 1.38 ఎకరాలు, ఎంపీడీవో కార్యాలయానికి 0.25 ఎకరాలు, జవహర్ నవోదయ విద్యాలయానికి 30 ఎకరాలు, మోడల్ పాఠశాలకు 10 ఎకరాలు, నీటిపారుదలశాఖ స్టోర్ రూమ్కు ఎకరం చొప్పున అప్పగించారు.
కొయిల్సాగర్ బాధితులకూ..
మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజె క్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి కూ డా ఇక్కడే భూములు కేటాయించారు. కోయిల్ సా గర్ ముంపు బాధితుల కోసం నిజాంసాగర్ ప్రాజె క్టు పరిధిలోని 8 ఎకరాల భూమిని అప్పగించారు. అలాగే అటవీ శాఖ నుంచి రోడ్లు వేయడంతో ని జాంసాగర్ నవోదయ సమీపంలో 5 ఎకరాల భూ ములను అప్పగించారు. ఇలా ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు తగ్గిపోతున్నాయి.
సిద్దాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ఇవ్వాలనుకుంటున్న సాగర్ భూమి
వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అఖిల పక్షంగా ఏర్పాటయ్యారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల పరిరక్షణ కోసం పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు భూములను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.