
ఆ కార్డులు రద్దయినట్లే!
అనుమానాస్పద రేషన్కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరు నెలలుగా బియ్యం తీసుకోని వారి లెక్కలు తీసిన సర్కారు.. వాటిపై విచారణ చేపట్టింది. జిల్లాలో అధికారులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన 1,620 కార్డులపై విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రక్రియ పూర్తయ్యాక జాబితాలోని చాలా రేషన్ కార్డులను తొలగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
కామారెడ్డి క్రైం : వివిధ రకాల కారణాలతో అనుమానాస్పదంగా అనిపించిన రేషన్ కార్డులు, వాటిలో నమోదైన వ్యక్తుల జాబితాలను పక్షం క్రితం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించింది. కొంత కాలంగా రేషన్ తీసుకోకపోవడం, రెండు చోట్ల కార్డు కలిగి ఉండడం, 18 ఏళ్లలోపు వయసున్న కార్డు యజమానులు, నకిలీ ఆధార్తో ఉన్న కార్డులు, చనిపోయి చాలా రోజులు గడుస్తున్నా జాబితాలోంచి తొలగించకపోవడం వంటి కారణాలతో వేలాది కార్డులను అనుమానాస్పద జాబితాలో చేర్చింది. వాటిలో కామారెడ్డి జిల్లాకు సంబంధించినవి 1,620 కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 2,669 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాటిలో చనిపోయిన వారు, చాలా కాలంగా రేషన్ తీసుకోని వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు రేషన్ కార్డుల విషయంలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్డుల్లో నకిలీ ఆధార్లు కూడా ఉన్నాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం..
అనుమానాస్పద రేషన్ కార్డుల జాబితా పక్షం రోజుల క్రితమే వచ్చింది. వాటిని సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో విచారణ పూర్తి చేశారు. ఆన్లైన్ ద్వా రా నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.
– మల్లికార్జున్ బాబు, డీఎస్వో, కామారెడ్డి
నివేదికల తయారీ..
పక్షం రోజుల క్రితం వచ్చిన అనుమానాస్పద రేషన్కార్డుల జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులు తహసీల్దార్లకు పంపించారు. వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. విచారణ నివేదికలను సైతం చాలా మంది తహసీల్దార్లు ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు సమర్పించినట్లు తెలిసింది. మరికొన్ని మండలాల నుంచి నివేదికలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. మండలాల వారీగా వచ్చిన నివేదికలను రాష్ట్రానికి, అక్కడ నుంచి కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాత అనర్హులుగా గుర్తించిన కార్డులను గానీ, కార్డులోని సభ్యులను గానీ తొలగించే అవకాశాలు ఉంటాయి. ప్రక్రియ మెత్తం ప్రభుత్వ వెబ్సైట్లోని లాగిన్లో పూర్తి చేస్తున్నారు. అనుమానాస్పద జాబితాలో వచ్చిన చాలా కార్డులను తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికలు ప్రభుత్వానికి చేరిన తర్వాతత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
జిల్లాలో 1,620 అనుమానాస్పద రేషన్ కార్డులు
వాటిలో 2,669 మంది లబ్ధిదారులు
పూర్తయిన విచారణ, త్వరలోనే
తొలగించే అవకాశం

ఆ కార్డులు రద్దయినట్లే!