
ప్రతి అంశంపై పట్టు సాధించాలి
కామారెడ్డి క్రైం : లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణలోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపికై న వారికి రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తోందని పేర్కొన్నారు. మొదటి విడతలో 131 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. రోజూ ఉదయం థియరీ, మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని తెలిపారు. అనంతరం శిక్షణ మెటీరియల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: బ్యాంకర్లతో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎంపీడీవోలు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్క్ అవుట్ త్వరగా ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను తొందరగా పూర్తిచేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి