
రేపటితో ముగియనున్న జొన్న కొనుగోళ్లు
బాన్సువాడ రూరల్: జిల్లాలో జొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మంగళవారంతో కొనుగోలు కేంద్రాలను మూసి వేయాలని మార్క్ఫెడ్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో యాసంగి సీజన్లో 71,223 ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. పెట్టుబడి, కూలీల ఖర్చులు తక్కువ కావడం, జొన్నలకు డిమాండ్ పెరుగుతుండడంతో మంచి ఆదాయం వస్తుందన్న ఆశతో ఈ పంట వేశారు. అడవి పందుల బెడదను తట్టుకునేందుకు పలువురు రైతులు పొలాల వద్ద సోలార్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. పంటను సేకరించేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా క్వింటాలుకు రూ. 3,371 మద్దతు ధర చెల్లించి రైతులనుంచి జొన్నలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11,275 వేల మంది రైతుల నుంచి సుమారు 29,215 మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దళారులను ఆశ్రయించే బాధ తప్పిందని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో జిల్లాలో సుమారు నెలన్నర క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేయనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో ఏర్పాటు చేసిన 24 జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే నాలుగింటిలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. వాటిని మూసి వేశాం. మిగిలినవాటిని 28 నుంచి మూసివేస్తాం. ఇంకా ఎవరి వద్దనయినా జొన్నలు మిగిలి ఉంటే మిగిలి ఉన్న ఒక్క రోజును సద్వినియోగం చేసుకోవాలి. – మహేష్కుమార్, డీఎం, మార్క్ఫెడ్