
భూభారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ
లింగంపేట(ఎల్లారెడ్డి): భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి అందిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మండలంలోని పొల్కంపేట, పర్మళ్ల, శెట్పల్లి, శెట్పల్లిసంగారెడ్డి, భవానిపేట ముంబోజిపేట గ్రామాల్లో గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడారు. భూ భారతి చట్ట ప్రకారం రైతులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. రైతులు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.