
తడిసిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు దించుకోవాలి
రాజంపేట: తడిసిన ధాన్యాన్ని సైతం దించుకోవాలని మిల్లర్లకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యంను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు పంటనష్టంపై నివేదిక ఇవ్వాలని కోరారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంపత్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, బాలు, రాజిరెడ్డి, చంద్రం, నర్సింలు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని
వెంటనే కాంటాలు పెట్టాలి
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం ఎమ్మెల్యే కేవీఆర్ పరిశీలించారు. మండలంలోని అడ్లూర్, చిన్నమల్లారెడ్డి అకాల వర్షానికి నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన తడిసినఽ ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వర్షానికి తడిసి పోకుండా టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని వెంట వెంటనే కాంటాలు చేయాలన్నారు. హమాలీలను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం వడగళ్ల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవటమే కాకుండా, ఇంకా పంట కోయని పొలాలు, మొక్క జొన్న పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి
కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్