
గోశాలకు ఆవుల తరలింపు
రామారెడ్డి: కరీంనగర్ జిల్లా నుంచి మూడు చిన్న టాటా ఏస్ వాహనాల్లో 16కు పైగా ఆవులను మంగళవారం మండుటెండలో తూప్రాన్ తరలిస్తుండగా మాచారెడ్డి పోలీసులు పట్టుకొని మద్దికుంటలోని గోశాలకు తరలించారు. ఈ ఆవులను తూప్రాన్ సంతలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కానీ ఆవులకు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో వాహనంలో ఆరు ఆవులను ఎండలో తరలిస్తుండడంతో అవి విలవిలకొట్టుకోవడాన్ని పోలీసులు గమనించి అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, ఆవులను మద్దికుంట గోశాలకు తరలించారు.
దొంగల ముఠా
సభ్యుల అరెస్టు
ఇందల్వాయి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సై సందీప్, డిచ్పల్లి సీఐ మల్లేశ్ వివరాలు వెల్లడించారు. గన్నారం ఎక్స్ రోడ్ దగ్గర పోలీసులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని, విచారించారు. వారం రోజుల కిందట ఇందల్వాయి మండలంలో జరిగిన వరుస దొంగతనాలు, జక్రాన్పల్లి మండలం పడకల్ల్లో జరిగిన దొంగతనాలకు, భిక్కనూరులోని బస్వాపూర్లో జరిగిన దొంగతనాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి, కోనారావుపేటల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని సభ్యులుగా గుర్తించారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సుమారు పది కేసులలో నిందితులుగా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ఆక్రమణల తొలగింపు
ఖలీల్వాడి: నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, న్యాల్కల్ ప్రాంతాలలో రోడ్డు వరకు ఉన్న షెడ్లు, ఆక్రమణలను మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.