
రుద్రూర్: చేనేత కార్మికులకు సరిపడ పని కల్పించాలని సిద్దిపేట చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరక్టర్ సంతోష్ కుమార్ ఆదేశించారు. రుద్రూర్ చేనేత సంఘాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంఘంలో ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలు పరిశీలించారు. ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. నేత పనిపై ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇప్పించాలని, అవసరమగు సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యాలయంలో రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్, బోధన్ చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, మేనేజర్ ఈర్వ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ నర్సింలు ఉన్నారు.
టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఇందూరు: తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలను బుధవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు దేగాం యాదాగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివా ళులు అర్పించారు. నాయకులు నారాయణ, వీరాచారి, గంగాధర్, ఆనంద్ నర్సింలు, సత్య నారాయణ, జావేద్,సాయిబాబా పాల్గొన్నారు.
తెయూను సందర్శించిన సీపీఆర్హెచ్ఈ ప్రతినిధులు
తెయూ(డిచ్పల్లి): ఎగ్జామినేషన్ కంట్రోలర్ సర్వేలో భాగంగా బుధవారం తెలంగాణ యూనివర్సిటీని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (సీపీఆర్హెచ్ఈ) న్యూఢిల్లీ ప్రతినిధులు సందర్శించారు. పరీక్షల మూల్యాంకనం పద్ధతులు, పరీక్షలు నిర్వహించే విధానాలను బృందం సభ్యులు డాక్టర్ గరిమ మలిక పరిశీలించారు. కంట్రోలర్ అరుణ వారికి వర్సిటీ డైరీలను అందజేశారు. అడిషనల్ కంట్రోలర్ సాయిలు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్ పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన
కామారెడ్డి క్రైం: సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని ఎస్పీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడమే కారణం అని ఎస్పీ తెలిపారు. పోలీస్శాఖలో ఉపయోగిస్తున్న అప్లికేషన్లను పూర్తిగా తెలుసుకోవాలన్నారు.


