మోతుగూడెం: మత్తు పదార్థాలను వాడడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ హేమంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన హత్యలు, మద్యం మత్తులో ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యక్తులు, కుటుంబాలు ఎదుర్కొన్న నష్టాలను వివరించారు. ఇటువంటి సంఘటనలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితులకు దారితీస్తాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల రక్షణ, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో సుమారు 150 మంది గ్రామస్తులతో పాటు చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నసీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


