● శ్రీపీఠానికి భారీగా తరలివచ్చిన భక్తులు
● పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా
ఆలయ గోపురానికి అభిషేకం
● హెలికాప్టర్ ద్వారా పూలవాన
కాకినాడ రూరల్: రమణయ్యపేట శ్రీపీఠంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యాన ఈ నెల 4 నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ మహా కుంభాభిషేకం, దివ్య ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం మూలమంత్ర సహిత లలితా కుంకుమార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అదే రోజు సాయంత్రం విశేషాభిషేకం నిర్వహించారు. గురువారం లలితా కుంకుమార్చన, సాయంత్రం మహా యంత్రేశ్వరి దేవికి భక్తులతో పుష్పార్చన జరిగాయి. శుక్రవారం ఉదయం మూలమంత్ర సహిత లలితా కుంకుమార్చన అనంతరం పవిత్ర జలాలలో కూడిన ఐశ్వర్య కలశాలతో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వరస్వామి ఆలయ గోపురంపై మహాకుంభాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రఘోష నడుమ పరిపూర్ణానంద స్వామి పవిత్ర జలాలతో తొలుత కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. మధ్యలో హెలికాప్టర్ నుంచి ఆలయ గోపురంపై పూలవాన కురిపించారు. భారీగా తరలివచ్చిన భక్తులు మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. సాయంత్రం భగవతి సేవ నిర్వహించారు. కేరళలో ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆరాధనను శ్రీపీఠంలో నిర్వహించి, సకలాభీష్టాలూ నెరవేరాలని, శుభాలు, సంపదలు తప్పక కలగాలని పండితులు ఆశీర్వదించారు.
హెలికాప్టర్తో పూలవాన
చందన అలంకరణలో సుందరేశ్వర
సమేత ఐశ్వర్యాంబిక అమ్మవారు


