తాళ్లరేవు: తమపై దౌర్జన్యం చేసి, తన భర్త పాలెపు సత్యనారాయణపై దాడి చేసి గాయపరచి, అతని మృతికి కారకులైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని పాలెపు మధులత డిమాండ్ చేసింది. గురువారం కోరంగి పంచాయతీ సీతారామపురంలో మధులత తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు మొర పెట్టుకుంది. చినబొడ్డు వెంకటాయపాలెంలో తమకు ఉమ్మడి ఇల్లు ఉందని, అయితే ఆ ఇంటిలోకి రానీయకుండా తమ మరిది పాలెపు లక్ష్మణరావు, అతని భార్య కుమారి, కుమారుడు నాని తదితరులు అడ్డుకుని తన భర్తను తోసివేయడంతో కిందపడి గాయపడ్డాడని తెలిపింది. చికిత్స పొందుతూ మృతి చెందాడని, మృతదేహాన్ని తమ సొంత ఇంటి వద్దకు తీసుకురాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును కడసారి చూసుకునే అవకాశం ఇవ్వకుండా తన మామ పాలెపు గురవయ్యను వేధించారని వాపోయింది. గ్రామ పెద్దల సహకారంతో చూసే అవకాశం కల్పించి, అంత్యక్రియలు నిర్వహించారని తెలిపింది. తన భర్త చావుకు కారకులైన వారిపై చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరారు.


