రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగాను ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తరచూ చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయ ప్రాంగణంలోని జల ప్రసాదం ట్యాంకులో పిల్లి కళేబరం లభించడంతో ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. దివీస్ ల్యాబ్ సంస్థ రూ.లక్షలతో ఆలయ ముఖద్వారం వద్ద సురక్షిత తాగునీటి ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దాని వద్ద విపరీతమైన దుర్వాసన వస్తూండడంతో బుధవారం సిబ్బంది పరిశీలించగా, వాటర్ ట్యాంకులో పిల్లి కళేబరం కనిపించింది. వెంటనే దాన్ని తొలగించి ట్యాంకు శుభ్రం చేశారు. దీనిపై ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని వివరణ కోరగా పిల్లి వాటర్ ట్యాంకులో పడి చనిపోయిన సంఘటన వాస్తవమేనని, దానిని తొలగించి శుభ్రం చేయించడం జరిగిందన్నారు. తాను కూడా అదే నీరు తెప్పించుకుని తాగుతానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇటీవల ఆలయ ప్రాంగణంలో విద్యుత్ షాక్కు గురై ద్రాక్షారామ వాసి మృతి చెందారు. అత్యంత ప్రాచీనమైన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైంది. అలాగే సప్త గోదావరిలో వృద్ధుడు మునిగి చనిపోయాడు.


