బాలల రక్షణే ధ్యేయం
కాకినాడ క్రైం: బాలల రక్షణ, భద్రతే ధ్యేయమని పలువురు అధికారులు అన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహా మరో ఆరు శాఖల సమన్వయంతో కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఎస్పీ బిందుమాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బాల్యాన్ని రక్షించుకోవలసిన ఆవశ్యకతతో పాటు బాలలను రక్షించే వివిధ విధానాలపై ఈ సందర్భంగా చర్చించారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సుమారు 350 మంది పాల్గొనగా, వంద మందికి పైగా కూర్చునే ఏర్పాట్లు లేక మెట్లపై, ఆరుబయట కూర్చున్నారు. భోజనం ఏర్పాట్లు తగినంతగా చేయకపోవడంతో సిబ్బందిలో అధికులు బయటకు వచ్చి ఆహారం కొనుక్కున్నారు. తగిన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడ్డామని పలువురు మహిళలు వాపోయారు.
మరింత విషమంగా కల్తీ పాల
బాధితుల ఆరోగ్యం
8 నుంచి 11కు చేరిన వెంటిలేటర్,
డయాలసిస్ కేసులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాల ఘటనలో తీవ్ర అనారోగ్యం పాలై, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం రోజురోజుకూ మరింత విషమంగా మారుతోంది. ఈ ఘటనలో మొత్తం 15 మంది చికిత్స పొందుతూండగా.. వీరిలో వెంటిలేటర్పై ఒకరు, డయాలసిస్ ఆరుగురు, వెంటిలేటర్, డయాలసిస్పై ఎనిమిది మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం డయాలసిస్ 4, వెంటిలేటర్, డయాలసిస్పై 11 మందికి అత్యవసర చికిత్సలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రోజూ మాదిరిగానే 110 మంది కల్తీ పాల వినియోగదారుల ఇళ్లలో వైద్య బృందాలు సర్వే చేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాయి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలూ నమోదు కాలేదు. వచ్చే నెల 4వ తేదీ వరకూ ఈ సర్వే నిర్వహించనున్నారు.
కల్తీ పాలను గుర్తించడంపై
అవగాహన
అమలాపురం టౌన్: పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే తెలుసుకోవడానికి సులభమైన కొన్ని పరీక్షలను అమలాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) డాక్టర్ ఎల్.విజయరెడ్డి వివరించారు. స్థానిక పద్మినీ పేట ప్రాంతంలోని వీరన్న డెయిరీ వద్ద పాడి రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నీటి శాతం, స్టార్చ్, యూరియా, డిటర్జెంట్ వంటి కల్తీలను సులభంగా పరీక్షించవచ్చని సూచించారు. తాజా పాలు తెల్లగా, చిక్కగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆ పాలు మంచివని నిర్ధారించవచ్చన్నారు. ఇంట్లోనే పాలు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఆయా పరికరాలతో ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. వాటర్, షేక్ టెస్ట్లు తదితర విధానాలను వివరించారు. తాజా పాలు మంచి సువాసన కలిగి ఉంటాయని, రసాయనాల వాసన రావని తెలిపారు. పాలు మరిగించినప్పుడు ఆ పాలు కల్తీ స్వభావం బయట పడుతుందన్నారు. సింథటిక్ పాలను మరిగించినప్పుడు నురగ వచ్చి మీగడ ఏర్పదని విజయరెడ్డి వివరించారు.
అన్నదాన పథకానికి విరాళాలు
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన పథకానికి పలువురు వివరాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన నడింపల్లి కృష్ణ సూర్యవర్మ, కుటుంబ సభ్యులు రూ.లక్ష, ఈతకోటకు చెందిన కలిదిండి సాయిమణికంఠ, వెంకట కాశి హర్షిత్వర్మ రూ.50 వేలు, విశాఖపట్నం పెందుర్తి వాస్తవ్యులు మహాదేవ్ కార్తికేయ కుటుంబ సభ్యులు రూ.30 వేలు విరాళాలు అందించారు. దాతలకు స్వామివారి పటాలను అధికారులు, పాలకవర్గ సభ్యులు అందించారు.
గిరిజనులు ఆర్థికంగా
అభివృద్ది చెందాలి
రంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలని జాతీయ మానవ హక్కుల మానిటరింగ్ అధికారి హేమంత్ కుమార్ అన్నారు. మారేడుమిల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను, కొత్త కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని, కుట్రవాడలో జాఫ్రా ప్రాసెసింగ్ యూనిట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఆహారం అందించాలన్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషుతో పాటు హిందీ చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు.


