జీతాలు పెంచే వరకూ పోరాటం ఆగదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీతాలు పెంచేంత వరకూ అంగన్వాడీల పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి అన్నారు. యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రెండో రోజైన శుక్రవారం ఆమె ప్రారంభించారు. వేతనాలు పెంచకుండా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలను బుజ్జగించడం, బెదిరించడం మానుకుని, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మార్చి 2న నిర్వహించే చలో విజయవాడ మహాధర్నాకు ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర స్థాయి పోరాటాలకు అంగన్వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏడేళ్లుగా వేతనాలు పెంచకపోతే ఎలా బతకాలని బేబీరాణి ప్రశ్నించారు. దీక్షా శిబిరం నుంచే ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పంపిస్తున్నట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ నిమ్మరసం ఇచ్చి రెండో రోజు దీక్షలను విరమింపజేశారు.


