పాల తయారీకి కెమికల్స్ వినియోగిస్తే చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పాల తయారీకి కెమికల్స్, పాల పౌడర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అసిస్టెంట్ పుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల వ్యవహారం ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల వ్యాపారాలపై బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్, సినిమా రోడ్డులో గల రైతుపాలు, కేశవ మిల్క్ల కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణం గమనించారు. శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా నందాజీ మాట్లాడుతూ గ్రామాల నుంచి సేకరించిన పాలను ప్యాకెట్లతో విక్రయిస్తున్న కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తమ తనిఖీఓ్ల ఐస్ వినియోగించి పాలను నిల్వ చేయటం గమనించామన్నారు. పాల కేంద్రాల్లో పాలు నిల్వలకు ఫ్రీజర్లు వినియోగించాలని, కాలం చెల్లిన ధర్మాకోల్ బాక్స్లు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పాల కేంద్రాలలో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. కెమికల్స్ వినియోగించినట్టు నిర్ధారణ అయితే వారిపై ఆహార భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాల తయారీకి పాల పౌడర్ వాడుతున్నట్లు గమనించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో పుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.


