ఇది ఆ పులి కాదు
సీటిఆర్ఐ (రాజమహేంద్రవరం): పాపికొండలు అభయారణ్యంలో ఇటీవల విడిచిపెట్టిన పులి మళ్లీ రంప ప్రాంతంలోకి వచ్చిందంటూ అక్కడి అధికారులు చెబుతుండగా.. ఆ పులి ఇది కాదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో హడలెత్తించిన పెద్ద పులి.. మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. కూర్మాపురం వద్ద పట్టుకున్న పులిని ఈ నెల 14న పాపికొండలు నేషనల్ పార్కులో విడిచిపెట్టామన్నారు. ముందుగా దానికి జీపీఎస్ రేడియో ట్రాకర్ సిస్టం అమర్చామన్నారు. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణం గల పాపికొండల నేషనల్ పార్కులో అది ఎక్కడ ఉందో తమకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. దాన్ని విడిచిపెట్టిన ప్రాంతంలో ఆహారంగా ఉపయోగపడేలా కొన్ని జింకలను కూడా వదిలామన్నారు. అది మగ పులి కాబట్టి, రెండు ఆడ పులులను తీసుకువచ్చి ఆ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తాజాగా పులి తిన్న ఒక జంతు కళేబరాన్ని ఆయన మీడియాకు చూపించారు. రంపచోడవరం వద్ద పులి సంచరిస్తోందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమహేంద్రవరం పెద్దపులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టామని, అది మంచి ప్రవర్తన కలిగిన పులి అని చెప్పారు.


