‘సూర్యఘర్’ పనులు
వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సోలార్ ప్యానళ్ల సరఫరాదారులతో కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. సోలార్ ప్యానళ్లు, పీఎం కుసుమ్ పథకంలో రైతులకు సోలార్ పంపుసెట్ల ఏర్పాటు వంటి అంశాల పురోగతిని సమీక్షించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 19,593 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. ఇందుకు అవసరమైన సర్వే పూర్తి చేసి, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అగ్రికల్చర్ ఫీడర్లు ఉన్న సబ్ స్టేషన్ దగ్గరలో ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూములను గుర్తించడం ద్వారా అక్కడే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పగటి పూట నిరంతర వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


