కౌలు రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కౌలు రైతులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యాన సోమవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీనియర్ ఉద్యమ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌలు రైతుల సంక్షేమం కోసం సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఈసీ చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 2025 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ సాయం అందించలేదని, తొలకరిలో పంట నష్టం నమోదు చేసినప్పటికీ పరిహారం మాత్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. రాజబాబు మాట్లాడుతూ, పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు తగ్గించాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి కోసం ప్రభుత్వానికి అనేకసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ స్పందిచనందున ఈ దీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో వేస్తోందని అన్నారు. పంట పెట్టుబడి పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కౌలు రైతుల నిరాహార దీక్షకు ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ రమణి, పెన్షనర్ల సంఘం జిల్లా నాయకుడు యు.సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.సత్తిరాజు, ఎస్ఎఫ్ఐ నాయకుడు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మద్దతు పలికారు.


