చలో విజయవాడను విజయవంతం చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) సమర శంఖం పేరిట చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకుడు కేవీ శేఖర్ మాట్లాడుతూ, 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి, మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏ, 11వ పీఆర్సీ ఏపీజీఎల్ఐ, పీఎఫ్ సరెండర్ లీవ్స్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఈఓల బదిలీలు నిర్వహించాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి రామ్తేజ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


