ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నివారణ
కరప: ఆరోగ్య నియమాలు పాటిస్తూ ముందస్తు పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు అనుసరిస్తే క్యాన్సర్ నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహనాయక్ పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలం నడకుదురు ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో క్యాన్సర్పై ఉన్న అపోహలు తొలగించాలన్నారు. క్యాన్సర్ నివారణకు నిర్వహిస్తున్న ముందస్తు పరీక్షలపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలన్నారు. ముందుగానే స్క్రీనింగ్ చేయించుకుని, తదుపరి జరిపే చిన్నపరీక్ష ద్వారా క్యాన్సర్ నిర్ధారించి, నివారణకు మందులు ఇవ్వడం జరుగుతుందని డీఎంహెచ్ఓ వివరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత ఫ్రైడే డ్రైడేలో ఆయన పాల్గొని పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కేవీ సుబ్బరాజు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్, జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ వి.అరుణ, కరప పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వి.ఏంజలిన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
‘శివసదన్’కు
రూ.10 లక్షల విరాళం
అన్నవరం: రత్నగిరిపై సత్రం డోనార్ స్కీం కింద శివసదన్ సత్రంలో ఒక గదికి కాకినాడకు చెందిన ములకల సుబ్బారావు, కనకదుర్గ దంపతులు రూ.పది లక్షలు విరాళంగా సమర్పించారు. ఆ మేరకు చెక్కును శుక్రవారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందచేశారు. దాత దంపతుల అభీష్టం మేరకు ఈ పథకం కింద ఆ సత్రంలో గదిని కేటాయించడంతో బాటు పలు ప్రయోజనాలు, ఆలయంలో గౌరవ మర్యాదలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.
10 నుంచి సమ్మెటివ్ పరీక్షలు
కంబాలచెరువు: అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నెల పదో తేదీ నుంచి సమ్మెటివ్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నామని అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్కుమార్ శుక్రవారం తెలిపారు. మండల కేంద్రానికి చేరిన ప్రశ్న పత్రాల బండిళ్లను ప్రధా నోపాధ్యాయులు సరిచూసుకున్న పిదప బాక్సులలో భద్రపరిచామని ఆయన తెలిపారు. పరీక్షకు గంట ముందు ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ప్రశ్న పత్రాల బండిళ్లను అందచేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, సీఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె.శ్రీనివాసరావు, పబ్బినీడి ప్రసాద్, కుమారి, ఇందిర, నాగలక్ష్మి, కోటేశ్వరి, అర్బన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నివారణ
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నివారణ


