
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్ధులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు. డీఎల్ఎస్ఏ అందిస్తున్న సేవలను వివరించారు.
హాస్టల్లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి తనిఖీ