
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 25 వేల మంది
ఫదేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని సుమారు 25 వేల మంది దర్శించి, పూజలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు కావడంతో ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతు లు వెలిగించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులకు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఘనంగా రథ సేవ
రత్నగిరిపై సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద వేంచేయించారు. అర్చకులు దత్తాత్రేయశర్మ, గణేష్ తదితరులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవమూర్తులను తిరిగి ప్రధానాలయానికి చేర్చారు.
1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం
ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ ఒక్క రోజే 1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులకు రత్నగిరిపై సుమారు 30 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. మిగిలిన 80 వేల ప్యాకెట్లను లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో కొనుగోలు చేశారని దేవస్థానం అధికారులు తెలిపారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.20 చొప్పున లక్ష ప్యాకెట్లకు గాను దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. లోవ దేవస్థానానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో, కొండ దిగువన తొలి పావంచా వద్ద, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద చెరో 30 వేలు.. కొత్త నమూనా ఆలయం వద్ద 10 వేల చొప్పున ప్రసాదం ప్యాకెట్లు విక్రయానికి ఉంచారు. రాత్రి ఏడు గంటల సమయానికే ఈ ప్యాకెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో మరో 10 వేల ప్యాకెట్లు తయారు చేయించి, కౌంటర్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రత్నగిరికి భక్తుల తాకిడి