
డబ్బు తీసుకొని టీమ్ తయారు
ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతిభ ఉన్న క్రీడాకారులను తయారు చేయాల్సిన కోచ్లు, అసోసియేషన్ సభ్యులు డబ్బు తీసుకొని క్రికెట్ టీమ్ను తయారు చేస్తున్నారని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. కాకినాడలోని ఒక హోటల్లో శుక్రవారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జోన్ల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు హాజరయ్యారు. శివకుమార్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఏ ఫార్మెట్లోనూ టోర్నమెంట్లు నిర్వహించలేదని, క్రీడాకారులు వారి ప్రాక్టీస్ కోసం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం దారుణమన్నారు. ప్రతిభను పక్కన పెట్టి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వారిని జట్టులోకి తీసుకున్నారన్నారు. అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నియంతృత్వ ధోరణి కారణంగా క్రికెట్ క్రీడాకారులు భవిష్యత్ కుంటుపడుతోందని, ఈ విషయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకొని అసోసియేషన్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 40 సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ మాజీ సెక్రటరీ కె.బాపిరాజు, మాజీ ఉపాధ్యక్షుడు ఏఎస్ స్వరూప్, రాజమహేంద్రవరం ఇన్చార్జి విజయ్కుమార్, కోనసీమ ఇన్చార్జి ఏవీటీ వర్మ, పెద్దాపురం ఇన్చార్జి ఎ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.