
7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: మే ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు వారం రోజుల పాటు జరగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సహకరించాలని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కోరారు. బుధవారం రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో జరిగిన ప్రభుత్వ శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ వైశాఖ శుద్ధ ఏకాదశి, మే ఎనిమిదో తేదీ రాత్రి 8–30 గంటల నుంచి జరుగునున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణం తలంబ్రాలు, ప్రసాదం పంపిణీ చేయడానికి తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణం తిలకించే భక్తులు, గ్రామస్తుల కోసం టోల్గేట్ నుంచి రత్నగిరికి ఎనిమిది ఉచిత బస్లు నడపాలని నిర్ణయించారు. పంపా నదిలో కొంతమేర నీరు ఉన్నప్పటికీ ఉత్సవాల నాటికి పంపా ఏలేరు రిజర్వాయర్ నుంచి పంపాకు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు. శ్రీసత్యదేవుని కల్యాణ మహోత్సవం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి, ఊరేగింపులు జరిగే ఐదు రోజులు సాయంత్రం అన్నవరంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. 11 వ తేదీ సాయంత్రం టేకు రథంపై జరగనున్న సత్యదేవుని రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.