జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సైక్లింగ్ మంచి వ్యాయామం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి రోజూ ఒక గంట సైకిల్ తొక్కడం శరీరానికి మంచి వ్యాయామమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ఆయన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్ఏలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎస్ఏ నుంచి నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ, తిరిగి డీఎస్ఏ వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు సమీర్, నాగేంద్ర, సురేష్, సత్తి చిన్నారి, కనకదుర్గ, క్రీడాకారులు పాల్గొన్నారు.
75.11 శాతం మందికి పోలియో చుక్కలు
కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కాకినాడ రామారావుపేట అర్బన్ పీహెచ్సీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) నరసింహ నాయక్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు ఇప్పించి, రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 1,94,437 మంది ఐదేళ్లలోపు పిల్లలుండగా 1,46,061 మందికి (75.11 శాతం) పోలియో చుక్కలు వేశామని డీఎంహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు బూత్ల స్థాయిలో పూర్తి చేశామని, రానున్న రెండు రోజుల్లో క్షేత్ర స్థాయి బృందాలు ఇంటింటికీ వెళ్లి, మిగిలిన పిల్లలకు పోలియో చుక్కల మందు వేస్తాయని వివరించారు.
రైలు నుంచి జారి పడి
వ్యక్తి మృతి
నిడదవోలు: రైలు నుంచి జారి పడి నిడదవోలు – నవాబుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆ వ్యక్తి ఒంటిపై పచ్చ రంగు టీ షర్టు, నాచు రంగు ఫ్యాంట్ ఉన్నాయి. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94906 17090 80191 57528 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం


