అన్నవరం: ప్రస్తుతం సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తులు నానాటికీ పెరుగుతున్న వేసవి ఎండలకు తాళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు పైబడి నమోదవుతూండటంతో అల్లాడిపోతున్నారు. పలువురు ఎక్కువ ధరలకు శీతల పానీయాలు, చల్లని మంచినీరు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. గతంలో వేసవి ప్రారంభమవుతూండగానే.. రత్నగిరిపై రామాలయం ఎదురుగా సర్క్యులర్ మండపంలోను, పశ్చిమ రాజగోపురం ఎదురుగాను భక్తులకు అల్లం, కరివేపాకు కలిపిన చల్లని మజ్జిగ పంపిణీ చేసేవారు. దీంతో భక్తులు సేద తీరేవారు. ఈ ఏడాది మాదిరిగానే 2023లో కూడా ఎండలు అధికంగా ఉండటంతో మార్చి 18 నుంచే మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎండల తీవ్రతను బట్టి తీసుకోవాలి. అంతే కానీ, గత ఏడాది పంపిణీ చేసిన తేదీ ప్రాతిపదిక కారాదు. కానీ దేవస్థానం అధికారులు మాత్రం గత ఏడాది ముహూర్తానికే ఈసారి కూడా పంపిణీ చేయాలనుకోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మజ్జిగ పంపిణీ ప్రారంభించాలని కోరుతున్నారు.