గద్వాల క్రైం: నకిలీ డాక్యుమెంట్లతో బైక్ రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై స్థానిక రూరల్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఆదివారం స్థానిక మేఘనాథ ఆటో మొబైల్స్ హీరో షోరూం మేనేజర్, ఆర్టీఏ ఏజెంట్తో పాటు ఫేక్ ఫొటోతో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బైక్ రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ వ్యవహారంలో రెండు రోజుల క్రితం ఆర్టీఏ అధికారులతో పోలీసులు ఆరా తీశారు. అందుకు సంబంధించిన నివేదికలు, రికార్డులను సేకరించారు. వాటి ఆధారంగా పోలీసులు బైక్ కొనుగోలుదారుడి డాక్యుమెంట్లను పునఃపరిశీలించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడి ఆధార్ కార్డును మాఫింగ్ చేసి.. తెలిసిన వ్యక్తి ఫొటోతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు నిర్ధారణకు వచ్చారు. నకిలీ వ్యక్తిని ఫొటో తీయించి, రిజిస్ట్రేషన్ చేయడంలో మర్మమేమిటో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, బాధితుడు బైక్ కొనుగోలు చేసేందుకు సదరు షోరూంకు వెళ్లినప్పుడు రూ. 85వేల ధర చెప్పడంతో ముందుస్తుగా రూ. 20వేలు చెల్లించి బైక్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కోసం సదరు వ్యక్తి అన్ని డాక్యుమెంట్లతో షోరూం నిర్వాహకులను సంప్రదించిన సమయంలో బైక్ విలువ రూ. 1.8లక్షలుగా పేర్కొనడం గమనార్హం. దీంతో అతడు బైక్ కొనడాన్ని విరమించుకున్నాడు. అయితే షోరూం నిర్వాహకులు మాత్రం అదే బైక్ను మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. విచారణ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడితేనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.
విచారణకు హాజరైన షోరూం
నిర్వాహకులు, ఆర్టీఏ ఏజెంట్


