
గురువులే మార్గదర్శకులు
● వారి స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలి
● కలెక్టర్ సంతోష్
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకుఘన సన్మానం
గద్వాలటౌన్: తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే మార్గదర్శకులు గురువులని.. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల స్ఫూర్తితో భవిష్యత్ రాణించాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కల్టెకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికై న 55 మందిని ఘనంగా సన్మానించారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులనుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని అందిస్తారన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి దిద్దితేనే గుర్తింపు వస్తుందని అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ఉద్యమం, జిల్లా ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అదే స్ఫూర్తితో జిల్లాలో అక్షరాస్యత పెంపుకు కృషి చేయాలని సూచించారు.
విద్యాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. అక్షరాస్యతలో వెనకబడిన మన జిల్లాను మొదటి వరసలో నిలపాలని, అందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు నడుస్తున్నాయని వివరించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా త యారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పా రు. గురు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకునిఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘనీ, మార్కెట్యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓతో ఉపాధ్యాయుల వాగ్వాదం
ఇదిలా ఉండగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. సన్మాన కార్యక్రమానికి ముందు ఎంపిక ప్రక్రియపై పలువురు ఉపాధ్యాయులు డీఈఓ అబ్దుల్ ఘనితోపాటు ఎంఈఓలతో వాగ్వాదానికి దిగారు. ఎంపిక విధానంపై నిరసన వ్యక్తం చేశారు. విద్యాధికారులపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సిఫారస్ లేఖలు తెచ్చకున్న వారికే అవార్డులు వరించాయని ధ్వజమెత్తారు. సినియార్టీని విస్మరించి జూనియర్లను ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపిక చేశారని మండిపడ్డారు. సుమారు అరగంట పాటు ఉపాధ్యాయులు విద్యాధికారులను చుట్టుముట్టి నిలదీశారు. ఎమ్మెల్యే జోక్యంతో ఉపాధ్యాయులు సద్దుమణిగారు.