
918 టీఎంసీలు
వంద రోజుల్లో
రికార్డుస్థాయిలో జూరాలకు పోటెత్తిన వరద
● 675 టీఎంసీలు నదిలోకి..
● ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల
● సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి
గద్వాల/ఆత్మకూర్: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది.
● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు.
భీమా లిఫ్ట్ – 2 2.9
నెట్టెంపాడుకు 4.3
కోయిల్సాగర్ 1.9
ఎంజీకేఎల్ఐ
4
విద్యుదుత్పత్తి 224