
కదంతొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
గద్వాలటౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం పేరిట అమలవుతున్న నూతన పింఛన్ విధానంతో కనీస పింఛన్ కూడా పొందలేమని, ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని, తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించారు. జేఏసీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛన్ ఉద్యోగుల హక్కు అంటూ నినదించారు. ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ వద్దు – ఓపీఎస్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
అది మన హక్కు..
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్, కోచైర్మన్లు నర్సింహారెడ్డి, విష్ణు, టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి బీమన్న, సీపీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోపాల్, బీకే వెంకటేష్, యూనుస్పాష, లక్ష్మన్న, బుచ్చన్న మాట్లాడారు. 2004 తర్వాత ఉద్యోగాలు పొందిన వారందరికీ పెన్షన్ రద్దు చేయడం దారుణమన్నారు. పెన్షన్ బిక్ష కాదని.. మన హక్కు అన్నారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాల భద్రత అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చనిపోయిన, రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు గ్రాట్యుటీ, పీఎఫ్ లేక పెన్షన్ అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ సంతోష్కు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శశీధర్రెడ్డి, ఆనంద్, ఖాజామీర్, రమేష్, లోకరాజు, రాధకృష్ణరెడ్డి, కృష్ణ, నర్సింహులు, రవికుమార్, తిమ్మప్ప, ప్రభాకర్శాస్త్రి, సుజాత, అశోక్ పాల్గొన్నారు.
ఓపీఎస్ అమలు కోరుతూ ర్యాలీ, ధర్నా