అలంపూర్: తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి వారసులే తీసుకోవాలని అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ అన్నారు. సోమవారం అలంపూర్ కోర్టు ప్రాంగణంలో సీనియర్ సిటిజన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి పిల్లలు సంరక్షించాలని, ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత చాలా మంది కూతుళ్లు, కుమారులు తల్లిదండ్రులను పోషించకుండా వదిలేస్తున్నారని, దీని వల్ల వారి జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి సందర్భంలో చట్టం ప్రకారం ఆస్తిని తిరిగి తల్లిదండ్రులే పొందవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనువాసులు, న్యాయవాదులు ఈదుర్ బాషా,ఆఫ్రోజ్ తదిదరులు పాల్గొన్నారు.
ఆశా కార్యకర్తల
సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడం కోసం క్షేత్రస్థాయిలో విస్తృత సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను విస్మరిస్తే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి సునిత హెచ్చరించారు. సమస్యల పరిష్కరం కోరతూ సోమవారం ఆశా కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, లేనిపక్షంలో తమ పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. వీటితో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశా వర్కర్ల సంఘటిత పోరాటాల ఫలితంగానే రూ.200 నుంచి రూ.9500 వరకు వేతనాలు పెరిగాయన్నారు. ఆశా వర్కర్లపై రోజురోజుకు పని భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహా, జల్లా ఉపాధ్యాక్షుడు ఉప్పేర్ నర్సింహా, ద్మమ్మ, మాధవి, కాంతమ్మ, చెన్నమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
గద్వాలటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేయాల్సిందేనని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలవురు అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలలో ఆమోదం తెలిపి గవర్నర్ పరిశీలించి నివేదికను రాష్ట్రపతికి పంపించారన్నారు. మూడు నెలలు అవుతున్నా నిర్ణయం ప్రకటించలేదన్నారు. ఏ బిల్లు అయినా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే అమలు చేసినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చుతున్నందుకే అనుకూలంగా లేమని బీజేపీ నాయకులు అనడం దారుణమన్నారు. ఇది ఆ వర్గంలో సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరించి, బీసీలకు ద్రోహం చేయకుండా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అఖిల పక్ష నాయకులు సత్యనారాయణ, హనీఫ్, వినోద్, వాల్మీకి, నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు, అతికూర్ రెహమాన్, ఇక్బాల్పాష, ప్రభాకర్, సుభాన్, హుస్సేన్ పాల్గొన్నారు.
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..