
పెండింగ్ పనులు పూర్తి చేయండి
● వచ్చే నెలలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలటౌన్: పట్టణ శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల అసంపూర్తి పనులను త్వరగా పూర్తి యాలని, వచ్చే నెల మొదటి వారంలో ఇళ్ల ప్రారంభోత్సవం ఉంటుందని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. డబుల్ ఇళ్ల నిర్మాణాలలో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ ఉన్న విద్యుత్ సౌకర్యాలు, పెయింటింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. రహదారి పనులను పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు, విద్యుత్శాఖ డీఈ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరం స్పందించండి
ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణం స్పందించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్ తదితర సమస్యలపై 72 వినతులు వచ్చాయి. ఆయా జిల్లా శాఖల ఆధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులను పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ పరికరాలు పంపిణీ
చేనేత పెన్షన్లు మరింత పారదర్శకంగా, సులభంగా లబ్ధిదారులకు అందించే విధంగా పోస్టల్ శాఖ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు బయోమెట్రిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మొత్తం 84 మందికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టు ఆఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.