
ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మట్టి కొరత ఉండొద్దు
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన ఇసుక, మట్టి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావాల్సిన ఇసుక, మట్టి లభ్యతపై కమిటీ సభ్యులతో చర్చించడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు అవసరమైన ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను, ఎనిమిది ట్రాక్టర్ల మట్టిని అందించి పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.100, మట్టికి రూ.400 చొప్పున వసూలు చేయాలన్నారు. వినియోగదారులు సంబంధిత తహసీల్దార్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిశీలించి మంజూరు చేయాలన్నారు. ఇసుక తవ్వకాలు పూర్తి పారదర్శకంగా జరగాల్సిందిగా ప్రతి ట్రాక్టర్ పంపిణీకి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా నమోదు చేసి తగిన రికార్డులను సమగ్రంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అవసరమైన ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు కనిష్ట ధరలకు అందజేస్తుందన్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఈ వనరులను వినియోగించుకుని త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. అధికారులు సైతం ప్రత్యేంగా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర వి.లక్ష్మీనారాయణ, మైనింగ్ ఏడీ వెంకటరమణ, డీపీవో నాగేంద్రం, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, మిషన్భగీరథ ఈఈ శ్రీధర్రెడ్డి, భూగర్భ జల ఏడీ మోహన్, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.