
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో సంచలనంగా మారిన తేజేశ్వర్ మిస్సింగ్, హత్య కేసును జిల్లా పోలీసు శాఖ వారం రోజుల వ్యవఽధిలోనే ఛేదించి, నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించడంపై రాష్ట్ర డీజీపీ అభినందించారన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా మరింత పటిష్టం చేయాలని, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. అదే విధంగా డ్రగ్ రహిత సమాజ స్థాపన లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా ఎస్పీ పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ మొగిల య్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐ లు, కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసు లు, మల్లేష్, శ్రీహరి, నందికర్ ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
అలంపూర్: అలంపూర్ మున్సిపల్ కమిషనర్గా శ్రీరాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కమిషనర్గా ఇక్కడికి వచ్చారు. కమిషనర్ను మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాతో సత్కరించారు. అదేవిధంగా నూతన కమిషనర్ను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ భర్త వెంకటేష్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకులు మద్దిలేటి స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సామేల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్ రాక
గద్వాల: జూరాల ప్రాజెక్టు సందర్శన నిమిత్తం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం రానున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించిన ఇనుప రోప్ల తాళ్లు తెగిపోయిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు స్థితిగతులను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు మంత్రి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
5న సాగునీటి సమస్యపై సదస్సు
పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సాగునీరు సమస్యలపై జూలై 5న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం మహబూబ్నగర్లోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందని తెలిపారు. కానీ కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు ఉన్న కావాల్సిన నీరు లేక చాలా వరకు భూములు బీడుగా మారుతున్నాయని, ఇప్పటికీ పాలమూరులో వలసలు తగ్గడం లేదని వాపోయారు.

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు