
ఆయన రూటే సపరేటు
సివిల్ సప్లయ్ శాఖలో ఓ అధికారి దందాల పర్వం
59 వేల మెట్రిక్ టన్నులు కేటాయింపు
రబీలో ధాన్యం దిగుబడులు అధికంగా ఉన్న నేపథ్యంలో గతం కంటే ఈసారి రికార్డు స్థాయిలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో జిల్లాలోని 37 రైస్ మిల్లర్లకు 59,507.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. అయితే ఇప్పటి వరకు అన్ని రైస్ మిల్లర్ల నుంచి సీఎమ్మార్ రైస్ రూపంలో కేవలం 15.43శాతం మాత్రమే బియ్యాన్ని తిరిగి అందించారు. వాస్తవానికి ధాన్యం కేటాయించిన అనంతరం సివిల్ సప్లయ్ శాఖ అధికారులు నిరంతరం రైస్మిల్లులలో తనిఖీలు నిర్వహిస్తూ లక్ష్యం మేర సీఎమ్మార్ బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లాలో అలాంటిదేమి జరగడం లేదు. దీనిపై పూర్తి బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారే చిక్కడు.. దొరకడు తరహాలో వ్యవహరిస్తుంటే ఇక రైస్మిల్లుల నుంచి సీఎమ్మార్ బియ్యం రావడం ఎలా సాధ్యపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గద్వాల: సివిల్సప్లయ్ శాఖలో ఓ ముఖ్యఅధికారి రూటే సప‘రేటు’. సదరు అధికారి జిల్లాకు వచ్చి ఏడాది కాలం గడచినా ఇప్పటివరకు ఆఫీసుకు వచ్చింది.. కుర్చీలో కూర్చున్నది తక్కువే. కార్యాలయానికి రాకుండానే అన్ని దందాలు చక్కపెట్టేస్తాడు. అడిగిన ‘రేటు’ కడితే నిబంధనలను తుంగలో తొక్కేసి పనులు చేసిపెడతాడు. ఈ క్రమంలోనే జిల్లాలో రెండు రైస్మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యం కేటాయింపులు చేయగా ఫలితంగా రూ.7 లక్షలు జేబులో వేసుకున్నట్లు బాహటంగానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తూ.. చర్యలకు వెనకంజ వేయడం జిల్లాలో హాట్టాపిక్గా మారింది.
ఇటీవల రెండు మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యం కేటాయింపులు
కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీనే దర్శనం
ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు శూన్యం