
సామాజిక భద్రతకు పింఛన్
గద్వాల: పింఛన్లు ప్రజలకు సామాజిక భద్రతను కల్గిస్తాయన్న దృష్టితో వాటి అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్లో చేయూత పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత ఫించన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఫించన్ అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన ఫించన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో పింఛన్పై ఎక్కువ ఫిర్యాదుల రావడంతో ఈ అంశంపై పూర్తిగా దృష్టిని సారించి, అన్ని సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో కనీసం 20 అర్హులైన కుటుంబాలను గుర్తించి, వారికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన ఫించన్దారుల వివరాలు సేకరిస్తే, వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఫించన్ మంజూరును పరిశీలిన జరిపి, ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని, గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని, ప్రతి పథకంలో వారి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం
ఇందిరమ్మ ఇళ్ల మార్క్అవుట్ నుంచి బేస్మెంట్ వరకు ప్రతి దశను వేగవంతంగా నాణ్యంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి మంగళవారం చీఫ్ సెక్రటరీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇళ్ల పురోగతిలో గత వారం జిల్లా స్థానం 30వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 15వ స్థానానికి చేరుకోవడం సంతోషకరమన్నారు. ఈ దశలో మంచి పురోగతి సాధించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇక ముందు కూడా సమన్వయంతో పని చేస్తూ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు,రాష్ట్ర సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటి ఫించన్ల పంపిణి సంచాలకులు గోపాలరావు, డీపీఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.