
ఇంటర్లో అడ్మిషన్లు పెంచాలి
మానవపాడు: గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తప్పకుండా 120 అడ్మిషన్లు పూర్తిచేయాలని జిల్లా నోడల్ ఆఫీసర్ హృదయరాజ్ తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని శ్రీ గంగు వెంకటకృష్ణరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళాశాలలో ప్రస్తుతం 60 అడ్మిషన్లు వచ్చాయని, తప్పకుండా మొత్తం 120 అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు. మానవపాడులో అడ్మిషన్ల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులు అడిగారని, వారు కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాల గదిలో ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల హాజరుశాతం ఎక్కువగా ఉండాలని సూచించారు. విద్యార్థులకోసం మానవపాడు, అమరవాయి, చెన్నిపాడు, జల్లాపురం, బోరవెల్లి తదితర గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తామని, డిపో మేనేజర్తో సోమవారం నుంచి బస్సులు తిరిగే విధంగా చూస్తామన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్స్పల్ పద్మావతి, వెంకటకృష్ణరెడ్డి, లక్ష్మణరావు, శ్రీనివాసులు, మహేందర్గౌడ్, ఫౌజియా, సతీష్కుమార్, కృష్ణ, బాలకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రేపు రెడ్క్రాస్ వార్షిక
సర్వసభ్య సమావేశం
గద్వాల: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీన సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
చట్టబద్ధ రాజ్యాంగ
సంస్థల దుర్వినియోగం
అలంపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర నాయకులు ఆర్. శ్రీరాంనాయక్ అన్నారు. అలంపూర్ పట్టణంలో సీపీఎం రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. సీపీఎం రాష్ట్ర నాయకులు ఆర్. శ్రీరామ్ నాయక్, పిట్టల రవీందర్ హాజరై ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజకీయ శిక్షణ తరగతుల్లో శ్రీరామ్నాయక్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలతో చట్టబద్ధమైన, రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు విధ్వంసం అవుతున్నాయని విమర్శించారు. బీజేపీ 11 ఏళ్ల పాలన నిరంకులశ, అప్రజాస్వామిక విధానాలతో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. బీజేపీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని ఇబ్బందులకు గురి చేస్తూ అణిచివేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఏక కేంద్ర రాజ్యాంగంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. అనంతరం రవీందర్.. మతం– మతోన్మాదం అనే అంశాలపై మాట్లాడుతూ.. దోపిడీని కొనసాగించడానికి మూఢ బావాలు పెంపొందిస్తున్నారని, ప్రజలు మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలన్నారు. పార్టీ కార్యకర్తలు సమాజంలో జరుగుతున్న అంశాలను శాస్రియ కోణంలో అధ్యయనం చేయాలని, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రసాద్, ఏ.వెంకటస్వామి, జి. రాజు, రేపల్లె దేవదాసు, జి కే,ఈదన్న, పరం జ్యోతి, మద్దిలేటి, నరసింహ, ఉప్పేర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
శనేశ్వరాలయానికి
భక్తుల తాకిడి
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు, గోత్రనామార్చనలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్రెడ్డి పాల్గొన్నారు.

ఇంటర్లో అడ్మిషన్లు పెంచాలి