
చర్యలు తీసుకోరా..?
రాజోళి: సంతకాలు ఫోర్జరీ చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను తయారు చేస్తున్న వారిపై అధికారులు ఫోకస్ పెడుతున్నారా లేదా అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ లో ఆధారాలతో సహా నకిలీగాళ్ల గురుంచి కథనాలు వస్తే ఇంతవరకు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పచ్చర్ల గ్రామానికి చెందిన తామేష్గౌడ్ ఇంటిని విక్రయించేందుకు చేసిన ఫోర్జరీ చేసిన మాన్దొడ్డికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరితో మాట్లాడగా ఆ సర్టిఫికేట్ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. ఆ సంభాషణ అంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయినా కూడా అధికారులు ఆ వ్యక్తి ద్వారా ఇతరుల ప్రమేయాన్ని రాబట్టి చర్యలు తీసుకోవడంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధారాలు ఉంటే బాధితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఆర్డీఓ నర్సింగ్రావ్ ‘సాక్షి’ ద్వారా జిల్లా ప్రజలకు తెలిపారు. దీంతో గురువారం పచ్చర్లకు చెందిన బాధితుడు తామేష్ రాజోళి ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ను కలిసి వినతిపత్రం అందచేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. జీవనోపాధి కోసమని భార్య పిల్లలతో కలిసి ఇతర గ్రామానికి వెళితే ఇలా నా ఆస్తినే అమ్ముకుంటే నాకు దిక్కేది అని బాధితుడు వాపోయాడు. ఫోర్జరీ చేసిన వ్యక్తి తానే చేశానని, ఇంకా ఏమైనా ఉన్నా చేస్తానని ధైర్యంగా చెప్పిన ఫోన్ రికార్డింగ్ బయటకు వస్తే కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాడు. నకిలీ సర్టిఫికేట్ తయారైన సమయంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా ఆ సంతకంతో, సర్టిఫికెట్తో తమకు సంబంధం లేదని చెప్పాక కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
అధికారులకు విన్నవించిన బాధితులు
సంతకాలు ఫోర్జరీ చేసి ఆస్తులు
తారుమారు