
ఉత్సాహంగా క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన ఎంపిక పోటీలను డీవైఎస్ఓ జితేందర్ ప్రారంభించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, కేజీ మెడిసిన్ బాల్పుట్, 300 మీటర్లు ఫ్లయింగ్ స్టార్ట్, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు వంటి తొమ్మిది క్రీడా విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 72 మంది విద్యార్థులు ఎంపిక పోటీలలో పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ బీఎస్ జితేందర్ విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు జైరాకేష్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, భరత్కుమార్, నగేష్బాబు, హైమావతి, సుహాసిని, బీసన్న, సతీష్కుమార్ పాల్గొన్నారు.