
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
గద్వాల కాంగ్రెస్లో అదే తీరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం.
భిన్నాభిప్రాయాలు..
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్జాన్తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ వాళ్లకే పనులు
మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ పేరుకు అధికార పార్టీ నాయకులమే కానీ.. పనులన్నీ బీఆర్ఎస్కు చెందిన నాయకులకే జరుగుతున్నాయని బాహాటంగానే ఆరోపించినట్లు తెలిసింది. పరిశీలకులు ఇది వరకే రెండుసార్లు వచ్చారని.. ఇది మూడోసారని.. అయినా నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పరిశీలకులకు ఉదాహరణలతో వివరించినట్లు సమాచారం.
2, 3 రోజుల్లో శుభవార్త..
సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్హాట్గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
అన్యాయం అంటూ సరిత..
తాము పార్టీని నమ్ముకుని ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నామని.. కానీ, తమకు తీరని అన్యాయం జరుగుతోందని పరిశీలకుల ఎదుట సరిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు మొదలుకొని.. ప్రభుత్వ శాఖలలో అన్ని రకాల పనుల వరకు తమకు భంగపాటు ఎదురవుతోందని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా నా వర్గం అని తెలుసుకుని పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీస్ కే సులు నమోదవుతున్నాయని, ప్రతిరోజు పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా ఎదురుకాదని.. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం.
మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి భేటీ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
వద్ద బండ్ల కృష్ణమోహన్రెడ్డితో..
హరిత హోటల్లో సరిత వర్గంతో..
చర్చనీయాంశంగా పరిశీలకుల తీరు
సీఎం సహకారంతో ముందుకు..
తనకు న్యాయం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధే ధేయ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. 30 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారమందిస్తానని చెప్పినట్లు తెలిసింది.

ఒకటే పార్టీ.. 2 సమావేశాలు