
9 ఏళ్లు.. 5 కి.మీ.,
డబుల్ నిర్మాణానికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి
●
అయిజ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు, 5 కల్వర్టులను నిర్మించేందుకు 2016లో అప్పటి ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఇదే దారిలో అయిజ సమీపంలోని పోలోని వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు మరో రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. అయితే పనులు ప్రారంభించి.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు అప్పట్లోనే సింగిల్ రోడ్డును తొలగించారు. రోడ్డు వెడల్పు చేసి కంకరవేసి నాలుగేళ్లపాటు బీటీ వేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు ద్విచక్రవాహనాలపై నుంచి కిందపడి అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర విమర్షలు చేయడంతో తిరిగి మూడు సంవత్సరాల క్రితం పనులు పునర్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తికాలేదు.
కాంట్రాక్టర్ను మార్చినా..
బిల్లులు చెల్లించడం లేదని మొదటి కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆర్అండ్బీ అధికారులు సదరు కాంట్రాక్టర్ను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మొత్తం 10 కి.మీ., బీటీ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ. మాత్రమే నిర్మించారు. అలాగే అయిజ సమీపంలో పోలోని వాగుపై రూ.2 కోట్లతో నిర్మించతలపెట్టిన హై లెవల్ బ్రిడ్జి సైతం అసంపూర్తి గానే ఉంది. ఇక్కడ కూడా కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశాడని సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు 2016 సంవత్సరంలో క్రితం రూ.12 కోట్లు మంజూరు చేశారు. 10 కి.మీ., పొడవైన ఈ రోడ్డులో 5 కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వం మూలంగా గడిచిన తొమ్మిదేళ్లుగా రోడ్డు నిర్మాణం సా..గుతోంది. ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ., మేర రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్.. ఒక్క కల్వర్టు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఫలితంగా ఇదే రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాల్సిన 20 గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
అసంపూర్తిగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం
బిల్లులు రావడం లేదు..
పులికల్ రోడ్డుపై పోలోనివాగు వద్ద రూ.2 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. అలాగే మండలంలోని చిప్పదొడ్డి, యాపదిన్నె గ్రామాల పరిసర ప్రాంతాల్లో బ్రిడ్జి పనులు చేపట్టాను. పనులు పూర్తి చేసినా బ్రిడ్జిలకు కూడా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు రూ.2.30 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉండటంతో పనులు ఆపేశాను. బిల్లు మంజూరు చేస్తేనే పనులు తిరిగి ప్రారంభిస్తాను. – హన్మంతురెడ్డి, కాంట్రాక్టర్
ప్రమాదాలు జరుగుతున్నాయి
రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది గాయాలపాల య్యారు. చికిత్స పొందు తూ కొందరు వ్యక్తులు ఆస్పత్రిలో మృతిచెందారు. ఇప్పటికై నా సరే అధికారులు స్పందించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తిచేయా లని కోరుతున్నాం. – పుల్లారెడ్డి, అయిజ
త్వరలోనే పూర్తి చేస్తాం..
రోడ్డు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురవుతు న్నాయి. మొదటి కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయకపోవడంతో తొలగించి.. మరొకరికి అప్ప గించాం. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆ దేశించాం. అయితే బిల్లులు రాలేదని హైలెవ ల్ బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిపివేశారు. సమ స్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– రాజేందర్, ఆర్అండ్బీ ఎస్ఈ
20 గ్రామాలకు ఈ రోడ్డే ఏకై క మార్గం
ఏళ్లతరబడిగా సా..గుతున్న పనులతో నరకయాతన
సగం కూడా పూర్తికాని రోడ్డు పనులు
హై లెవల్ బ్రిడ్జిది అదే పరిస్థితి
ప్రమాదపుటంచున ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీపంలోని నాగులదిన్నె, నందరవరం, ముగితి గ్రామాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి, మైనిపల్లి, రాజాపురం, పులికల్, మేడికొండ తదితర గ్రామాలు, అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల, అయిజ పట్టణ ప్రజలు ఈ రోడ్డుపైనే ప్రయాణం చేయాల్సి ఉంది. వీరంతా ఏళ్లతరబడిగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కంకర వేయడంతో ద్విచక్రవాహనదారులు తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నారు.

9 ఏళ్లు.. 5 కి.మీ.,

9 ఏళ్లు.. 5 కి.మీ.,

9 ఏళ్లు.. 5 కి.మీ.,

9 ఏళ్లు.. 5 కి.మీ.,