జూరాలకు వరదొచ్చింది | - | Sakshi
Sakshi News home page

జూరాలకు వరదొచ్చింది

May 30 2025 12:39 AM | Updated on May 30 2025 12:39 AM

జూరాల

జూరాలకు వరదొచ్చింది

పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న జూరాల ప్రాజెక్టు

గద్వాల/ధరూరు/ఆత్మకూర్‌: కృష్ణా బేసిన్‌లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాలకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది.

● జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుదుత్పత్తి ప్రారంభం

కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్‌కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్‌ఈ శ్రీధర్‌ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

18 ఏళ్ల తర్వాత

మే నెలలోనే ప్రవాహం

99 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 12 గేట్లు ఎత్తివేత

అర్ధరాత్రి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం

అప్రమత్తంగా ఉండాలి

జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో దిగువనున్న లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట కోసం మత్య్సకారులు నదిలోకి వెళ్లవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద పరిిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జూరాలకు వరదొచ్చింది 1
1/1

జూరాలకు వరదొచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement