
విత్తన నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలి
ధరూరు: విత్తన నాణ్యతపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే డీలర్ల మోసాల నుంచి బయటపడతారని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ రీజినల్ మేనేజర్ ఆది నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు కార్యాలయంలో మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ పరమేష్ అధ్యక్షతన విత్తన నాణ్యతపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన విత్తనాలు తెగుళ్లు, రోగాలు ఇతర ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయని అన్నారు. ప్రతి రకంలోనూ ప్రత్యేక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శాస్త్రవేత్తలు తయారు చేస్తారన్నారు. ప్రతి ఒక్క రైతు టీజీ సీడ్స్ విత్తనాలను రైతులు ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చునని అన్నారు. టీజీ సీడ్స్ విత్తరనాలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంఘాలు ఇతర డీలర్ల ద్వారా అన్ని మండలాలకు సరఫారా చేస్తున్నామని అన్నారు. ప్రతి మండలంలోనూ అందుబాటులో టీజీ సీడ్ విత్తనాలు ఉంటాయని, ముఖ్యంగా వరిలో సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ – 15048, బీపీటీ 5204, కేఎన్ఎం – 1638తో పాటు జేజీఎల్ – 27356, ఎంటీయూ 1224 వంటి కొత్త రకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల బాయంకు సీఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు.