
అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..
● ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత
సాధించిన మల్లెందొడ్డి విద్యార్థి
మల్దకల్: ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో మల్దకల్ మండలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థి తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనవసర భయమే తమ బిడ్డ ప్రాణం తీసిందని వాపోయారు.
తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
రాజోళి: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మాన్దొడ్డికి చెందిన నడిపి ఆంజనేయులు (52) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. ప్రస్తుతం తాటిముంజల సీజన్ కావడంతో, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో తాటికాయలు తెంచేందుకు చెట్టుపైకి ఎక్కిన ఆయన.. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
రేపు జాబ్ మేళా
గద్వాల: నిరుద్యోగ యువతకు గద్వాల, హైదారాబాదు కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈ నెల 24న జాబ్మేళా నిర్వహించునున్నట్లు ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు 24వ తేదీన గద్వాల పట్టణంలో బీసీ స్టడీసర్కిల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగే పాల్గొనాలని సూచించారు. నవభారత్ ఫర్టిలైజర్స్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుందని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.5,939
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 409 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 2899, సరాసరి రూ. 3669 ధరలు పలికాయి. అలాగే, 20 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6319, కనిష్టం రూ. 5806, సరాసరి రూ. 3669 ధరలు వచ్చాయి. 117 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 5639, సరాసరి రూ. 5879 ధరలు పలికాయి. 2294 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం రూ.2046, కనిష్టం రూ. 1701, సరాసరి రూ.1945 ధరలు లభించాయి.

అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..