
పాపుల రక్షణకు జీవితం అంకితం
గద్వాలటౌన్: పాపుల రక్షణకు క్రీస్తు జీవితం అంకితం చేశాడని హైదరాబాద్కు చెందిన రెవ. శ్యామ్రావ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చర్చిలలో ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంబీ మిస్పాచర్చి, ఒలీవ చర్చి, కర్మెలు చర్చి, హోసన్నా మందిరం, జమ్మిచేడు ఎంబీ చర్చి, జియోన్ చర్చి, హోలీ మినిస్ట్రీస్, ఎల్ఈఎఫ్, తదితర చర్చిలలో ఈస్టర్ పండగను పురస్కరించుకొని ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై యేసయ్యను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. క్రీస్తును ఆరాధించారు. వాక్యోపదేశాలు, బైబుల్ సూక్తులు విన్నారు. స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో జరిగిన పునరుత్థానం కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్యామ్రావ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవులకు దైవసందేశం ఇచ్చారు. లోక రక్షకుడు, మన పాపాలను తన రక్తంతో కడిగారని, ఆ యేసు ప్రభువు మరణించాక సమాధి చేసిన మూడు రోజుల అనంతరం మళ్లీ తిరిగి లేచాడని వివరించారు. దయామయుడు చల్లనిచూపు ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. కష్టసుఖాలను సమపాళ్లలో స్వీకరిస్తూనే.. లోకమంతా శాంతి స్థాపించాలన్నదే ఏసు ప్రభువు మార్గమని, అదే అందరికీ అనుసరణీయమని అన్నారు. స్థానిక జమ్మిచేడు ఎంబీ చర్చిలో సైతం ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలకు హాజరైన మహిళలు, యువతులు భక్తిగీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వేరువేరుగా ఈస్టర్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు.

పాపుల రక్షణకు జీవితం అంకితం